. . . ఎఐపీకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేసుకోవాలని ఎఐపీకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్ డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభ కోటగల్లిలోని ఎన్.ఆర్ భవన్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.గంగాధర్ సంస్థ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం జరిగిన మహాసభలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్ ప్రారంభోపన్యాసం చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనలో బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ రాయితీలు ఇచ్చారని, ఇంకా ఇస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు అసెంబ్లీలో లక్షల కోట్ల బడ్జెట్లను ప్రవేశపెడుతున్నారని, అందులో రైతు కూలీల సంక్షేమం గురించి చర్చనే ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మికులు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. రైతు కూలీల ఉద్యమాలకు అండగా ఉంటామన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐపీకేఎమ్మెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ మాట్లాడుతూ మన పాలకులు దశాబ్దాలుగా స్వదేశీ వ్యవసాయ విధానం చేపట్టలేదన్నారు. దేశంలో 14 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారన్నారు. ఇందులో తెలంగాణలో 60 లక్షల మంది, అందులో అధిక సంఖ్యలో ఉన్న మహిళా కూలీల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో కూలీల శ్రమ అనే ప్రధానంగా ఉంటుందన్నారు వీరికి కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నారు. మహత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా, కూలీల హక్కులను కాలరాసే విధంగా, కొత్త చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. పాత చట్టాన్ని అమలు చేసి బడ్జెట్లో ఉపాధికి సరిపోయే విధంగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి చేసుకుంటున్న వాణిజ్య ఒప్పందం దేశ వ్యవసాయ రంగాన్ని తీవ్రమైన సంక్షోభానికి గురిచేస్తుందన్నారు. మధ్యతరగతి రైతులు భూముల అమ్ముకొని కూలీలుగా మారిపోతారని, అందువల్ల ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో ఏఐపీకేఎంఎస్ జిల్లా నాయకులు గంగమల్లు, ఒడ్డెన్న, రమేష్, సీతారాం, దేవన్న, సాయిబాబా, గంగాధర్ మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు వెంకన్న, రాజేశ్వర్, సుధాకర్, మల్లేష్, గణేష్, అనిల్, నవీన్, సాయిబాబా, సాయరెడ్డి, చరణ్, లింగం, నసీర్ తదితరులు పాల్గొన్నారు.
