- విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం
నందిపేట్, బతుకమ్మ : నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మానవత్వాన్ని మరిచిపోయిన ఉపాధ్యాయుడు చిన్నారులపై దారుణంగా ప్రవర్తించిన ఘటన వెలిగిచూసింది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల కంట్లో, చెవుల్లో కారం పోసి కొట్టిన ఘటన ఆగస్టు 19న చోటుచేసుకున్నా ఇప్పటివరకు మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించకపోవడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఇదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు, అదే ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ అయినప్పటికీ పరిస్థితి మారకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానోపాధ్యాయుల భర్త డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్నాడనే అండతో నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు మండిపడుతున్నారు. ఘటన జరిగిన రోజు నుండి ఇప్పటివరకు ఆ ఉపాధ్యాయుడు పాఠశాలకు రాలేదని, శనివారం పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లగానే అక్కడి నుండి పారిపోయాడని తెలిపారు. ఇంతటి దారుణ సంఘటన జరిగినా మండల విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మండల విద్యాధికారి, ఉపాధ్యాయులపై సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో ఎంఇఓను ఫోన్ లో సంప్రదించగా ఘటన వాస్తవమేనని తెలిసిందని శనివారం వెళ్లి విచారించి నివేదిక పంపిస్తామని చెప్పారు. గ్రామస్తులు ఉపాధ్యాయుడిపై భౌతిక దాడి జరిగే ప్రమాదం ఉందని, అందుకే అతడిని పాఠశాల నుండి వెళ్లిపోమ్మని చెప్పినట్లు వివరించారు.