. . . బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు
. . . లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ ఎట్టకేలకు లొంగి పోయాడు. శనివారం న్యాయ వాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగి పోయాడు. బండి భగీరథ్పై నమోదు అయిన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఓ బాలికను లైంగికంగా వేధించాడని అతడిపై మే 8న కేసు నమోదు అయింది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు పంపినా భగీరథ్ స్పందించలేదు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ను ఆశ్రయించాడు. అయితే కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడం, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో భగీరథ్ లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కేసుతో ఆయన తండ్రికి ఇప్పటికే భారీగా పొలిటికల్ డ్యామేజీ అయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో భగీరత్ లొంగిపోయారు.
న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది : బండి సంజయ్
తన కుమారుడు లొంగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే అన్నారు. చట్టంపై గౌరవంతో తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని చెప్పారు. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగిందన్నారు. ఏ తప్పూ చేయలేదని భగీరథ్ అంటున్నాడని చెప్పారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని సంజయ్ తెలిపారు.