నీటి వనరు ఉన్నప్పటికిని మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తం
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్ కంపు కొడుతుంది. బస్టాండుకు నీటి వనరు బోరు పనిచేస్తున్నప్పటికిని మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేక దుర్వాసనతో ప్రయాణికులు ముక్కు మూసుకుంటున్నారు. ఈ బస్టాండులో మొత్తం 30కి పైగా షాపులు అద్దెకు ఇచ్చారు. వీటినుంచి ఆదాయం నెలకు సుమారు 3 లక్షలకు పైనే వస్తుంది. ఇంత ఆదాయం వచ్చే బస్టాండ్ కు ప్రయాణికులు నిత్యం సమస్యలతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినాక రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ బస్టాండు లోని మరుగుదొడ్లను ఉచితంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా బిచ్కుంద బస్టాండ్ లోని మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు బోరు మోటర్ ద్వారా నీటి సౌకర్యం ఉన్నప్పటికిని నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రయాణికులకు, బస్టాండ్ ఆవరణంలోని వ్యాపారస్తులకు దుర్గంధం బాధ తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరుగుదొడ్ల నిర్వహణను సక్రమంగా కొనసాగేలా చూడాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.