Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 4:08 pm Posted by : ramakrishna

ఆరు గ్యారెంటీల హామీలను వెంటనే అమలు చేయాలి

  • సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) డిమాండ్
  • జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు, అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతోపాటు అనేక వాగ్దానాలు ప్రకటించి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ రెండేళ్లయిన ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని,  నిర్మాణంలో వున్న వాటి బిల్లులను సకాలంలో అందించాలన్నారు. వికలాంగుల పెన్షన్  రూ.6 వేలకు, వృద్ధాప్య, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులందరికి జీవన భృతి రూ.4 వేలకు పెంచాలన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. మహిళలకు నెలకు ఇస్తానన్న 2,500 రూ॥ల పెన్షన్ ఇవ్వాలన్నారు. ఆటో, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12వేలు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవాలన్నారు. తడిసిన వరి, మొక్కజొన్న, పత్తి, సోయతోపాటు అన్ని పంటలను కొనుగోలు చేయాలన్నారు. వరి పంటకు బోనస్ ను వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి, వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులకు నెలకు ₹3 వేలివ్వాలన్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అమెరికా నుంచి పత్తి దిగుమతులను వెంటనే నిలిపివేయాలన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం  అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, నిజామాబాద్, బోధన్ డివిజన్ కార్యదర్శులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ జిల్లా నాయకులు కే.గంగాధర్,  బి.మల్లేష్,  బి.కిషన్  వివిధ సంఘాల నాయకులు సాయరెడ్డి, నాగమణి, సాయిబాబా,  కిరణ్, రెహనా,  అమూల్య, చరణ్,  గంగాధర్, రమేష్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

The six guarantees must be implemented immediately.