Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:37 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ ప్రక్రియను 100 శాతం విజయవంతం చేయాలి

 

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 100 శాతం విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎస్ఐఆర్ సమీక్ష, అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, రాజంపేట్, తాడ్వాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఎ లు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం నియోజకవర్గంలో 94 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తైందని, మిగిలిన ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బీఎల్ఎ లు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఓటు హక్కును బలహీనపరిచే ఎలాంటి చర్యలనైనా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)” పేరుతో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్లుగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, బిఎల్ఎ కీలక బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం గ్రామాల్లో 100 శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తి చేసిన బిఎల్ఎ లను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

 

The SIR process must be made 100 percent successful.