Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 5:11 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాన్ని తప్పని సరిగా పూర్తి చేయాలి

 

. . . నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ

 

. . . ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ అర్బన్ పరిధిలోని ఓటర్లు తమ ఓటరు వివరాలను సరిచూసుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి లేదా నవీకరించుకోవడానికి ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సూచించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియ అర్బన్ కోఆర్డినేటర్ ఆకుల లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫారం నింపే విధానం, సమస్యలు ఎదురైతే ఎవరిని సంప్రదించాలనే అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఆయన వివరించిన ప్రకారం, ఓటర్లు ఎస్‌ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాన్ని రెండు విధాలుగా పూర్తి చేయవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) ఇంటికి వచ్చి ఫారాన్ని అందజేస్తారు. ఫారంలో ఓటరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, పుట్టిన తేదీ, తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, పాత ఓటరు గుర్తింపు కార్డులోని ఈపిక్  నంబర్ నమోదు చేయాలి. ఆధార్ నంబర్ ఉంటే నమోదు చేయవచ్చని, అయితే అది తప్పనిసరి కాదని పేర్కొన్నారు. ప్రస్తుత మొబైల్ నంబర్ నమోదు చేయడంతో పాటు చివరలో సంతకం లేదా వేలిముద్ర వేయాలని తెలిపారు. అనంతరం రెండు నుంచి మూడు రోజుల తర్వాత బీఎల్‌ఓ ఇంటికే వచ్చి పూర్తి చేసిన ఫారాన్ని సేకరిస్తారని చెప్పారు. అలాగే, ఓటర్లు బీఎల్‌ఓ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక ఈసీఐ ఓటర్స్ పోర్టల్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో ఫారాన్ని సమర్పించవచ్చని వివరించారు. మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత “ఫిల్ ఎన్యుమరేషన్ ఫాం (ఎస్ఐఆర్)” ఎంపికను ఎంచుకుని, ఈపిక్ నంబర్ నమోదు చేసి వివరాలను పరిశీలించి ఫారాన్ని పూర్తి చేయవచ్చని తెలిపారు. ఎస్‌ఐఆర్ ఫారం నింపడంలో సమస్యలు ఎదురైనా, బీఎల్‌ఓ ఇంటికి రాకపోయినా లేదా ఓటరు గుర్తింపు కార్డుకు సంబంధించిన ఇతర సందేహాలు ఉన్నా, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని మున్సిపల్ జోన్ కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఈ కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన సూచనలు, సలహాలు అందించడంతో పాటు సంబంధిత బీఎల్‌ఓల వివరాలను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మనోహర్, రాజేంద్ర ప్రసాద్, రాజు ఆకుల, రాజేష్, శంకర్, పోల ఉష, స్వప్న, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

 

The SIR enumeration form must be filled out.