Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 4:37 pm Posted by : ramakrishna

హైదరాబాద్‌ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

  • 12(టి) బెటాలియన్ ఎన్.సి.సి. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  హైదరాబాద్‌ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని 12(టి) బెటాలియన్ ఎన్.సి.సి. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్  తెలిపారు. మంగళవారం నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లిబరేషన్ డే ఫొటో ఎగ్జిబిషన్‌ ను 12(టి) బెటాలియన్ ఎన్.సి.సి. కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియాజిత్ సూర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) హైదరాబాద్ లిబరేషన్ డే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం చాలా ప్రశంసనీయమన్నారు. హైదరాబాద్ లిబరేషన్ లో పోరాడిన నాయకులు ఎవరు, తదితర అంశాలను ఫొటో ఎగ్జిబిషన్‌లో కలవన్నారు. అప్పట్లో జరిగిన వివిధ సంఘటనలు ఫోటో ఎగ్జిబిషన్ లో తెలియజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్

The sacrifices of the martyrs who fought for the liberation of Hyderabad are memorable

పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ మాట్లాడుతూ…ఈ ఎగ్జిబిషన్ లో నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసేందుకు పోరాడిన రామ్ జి గోండు, కుమురం భీమ్, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, భాగ్యరెడ్డి వర్మ, కోదాటి నారాయణరావు, వందేమాతరం రామచంద్రరావు, తదితరుల ప్రముఖుల ఫొటోలను ఏర్పాటు చేశామన్నారు. బైరాన్ పల్లి ఘటన, పరకాల మరణకాండ, బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు, వందేమాతరం ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, ఆపరేషన్ పోలో వంటి ప్రధాన ఘట్టాలను వివరించే ఫొటోలు కూడా ప్రదర్శనకు ఉంచామన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 18 వరకు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిల చేతులు మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అంతకు ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో  కళాకారులు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్ మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్. కె. రసూల్ బి, పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ సూపర్డెంట్ కే జనార్దన్ రెడ్డి, జిల్లా యువజన ఆఫీసర్ శైలీ బెల్లాల్, ఆల్ ఇండియా రేడియో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్ రంగా రత్నం, కళాశాల పిఆర్ ఓ డాక్టర్ దండు స్వామి, చరిత్ర విభాగపతి రమేష్ గౌడ్, ఎన్.సి.సి. ఆఫీసర్  లెఫ్ట్నెంట్  డాక్టర్ ఎం రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బాలమణి, సీబీసీ ఏపీఏ రషిద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

The sacrifices of the martyrs who fought for the liberation of Hyderabad are memorable