- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా బాధ్యులు బుర్రి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తానని హామీ ఇచ్చిందన్నారు. గుడిసెలు వేసుకొని ఉన్నవారికి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని, గృహ లక్ష్మి పథకం ప్రతి మహిళకు ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అది కూడా అమలు చేయాలని, గృహ జ్యోతి కూడా అందరికీ అమల్లోకి రాలేదని అందరికీ వచ్చేటట్టు చూడాలని డిమాండ్ చేశారు. రూ.500 కే సిలిండర్ అని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపకపోతే పెద్ద ఎత్తున దేశంలో రాష్ట్రంలో పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు,నగర కార్యదర్శి సుజాత, నగర కార్యవర్గ సభ్యులు రాములు, నరసయ్య, నగర కమిటీ సభ్యులు అనసూయ, నరేష్, దీపిక, అనిత, కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.