బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు నల్ల పోచమ్మ, దుర్గమ్మ దేవతలకు బోనాల పండుగను కన్నుల పండువగా జరిపించారు. గ్రామంలో ముదిరాజ్ మహిళలు పురుషులు ఇంటింటికి ఒక బోనం చొప్పున డప్పు చప్పుళ్ళు, డిజె చప్పుల మధ్య గ్రామంలోని నల్ల పోచమ్మ, దుర్గమ్మ ఆలయాల చుట్టూ బోనాల ప్రదక్షిణ నిర్వహించి అమ్మవార్లకు నైవేద్యాలను సమర్పించారు. అనంతరం సాయంత్రం మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయం వరకు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో గ్రామ మహిళలు, పురుషులు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తరలివెళ్లి నల్ల పోచమ్మ ఆలయం చుట్టూ బోనాల ప్రదక్షిణ నిర్వహించి, అమ్మవారికి నైవేద్యం బోనాలను సమర్పించారు. సమర్పించారు. అనంతరం మొక్కులు మ్రొక్కుకుని రాబోయే వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ప్రజలందరూ జీవించాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
