- జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్
కామారెడ్డి, బతుకమ్మ : చిన్నారుల పేరెంట్స్ కు , బాలింతలకు, గర్భిణీలకు, కౌమార బాలికలకు పౌష్టికాహారం విలువ తెలిసేలా పోషక్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామంలో గల అంగన్వాడి కేంద్రంలో నిర్వహిస్తున్న పోషక్ అబియాన్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో స్టోర్ రూమ్ ను, వంటగదిని, చిన్నారులు తింటున్న ఆహారాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. ఆహారంలో ఉప్పు, నూనె, చక్కెరలు తగ్గించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కలిగే లబ్ధిని చిన్నారుల పేరెంట్స్ కు, బాలింతలకు, గర్భిణీలకు, కౌమార బాలికలకు తెలియజేయాలని, ప్రతిరోజు పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలను వివరించాలని, తల్లిపాలు బిడ్డలకు ఎంత శ్రేష్టమో తెలియజేయాలని సూచించారు. కిచెన్ గార్డెన్ ను పరిశీలించి అంగన్వాడికి అవసరమైన కూరగాయలను, ఆకుకూరలను పండించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీలకు సూచించారు. ఇంకా పెయింటింగ్ వేయని అంగన్వాడి కేంద్రాలలో త్వరగా పెయింటింగ్ వేసేలా పర్యవేక్షించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, సిడిపిఓ, అడిషనల్ సిడిపిఓ, ఎంపీడీవో, తాసిల్దార్ వివిధ శాఖల మండల మరియు గ్రామస్థాయి అధికారులు పాల్గొన్నారు.
