నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పట్టణ పరిశుభ్రతలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. పట్టణంలో పరిశుభ్రత పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శనివారం పలు డివిజన్లలో ప్రత్యేక మున్సిపల్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది విస్తృతంగా పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన పనులను చేపట్టారు.

కార్యక్రమంలో భాగంగా వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రపరచడం, చెత్త నిల్వలను తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడుకోవడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే పారవేయడం ద్వారా మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు సహకరించాలని పౌరులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఎంసీ నసీర్, ఎస్ఐలు, జవాన్లు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
