Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 2:42 pm Posted by : ramakrishna

సీఎం రేవంత్ పై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది

. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు లక్షలాది మంది తరలివచ్చారు

. ఊహించినదానికన్నా ఎక్కువ విజయవంతమైంది

. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ పై, 17 నెలల సీఎం రేవంత్ పాలనపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివచ్చిన లక్షలాది మందిలో స్పష్టంగా కనిపించిందని, కేసీఆర్ మళ్లీ రావాలని అంతా కోరుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఊహించిన దానికన్నా ఎక్కువ విజయవంతమైందన్నారు.

నిజమాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి సుమారు 40వేల మంది సభకు తరలివచ్చారన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన రెండు జిల్లాల జిల్లా పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ చార్జీలకు, రాష్ట్ర నాయకులు, మండల పార్టీ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రజతోత్సవ సభ విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని, అందుకే అడ్డగోలుగా వాగుతున్నారని విమర్శించారు.

దాదాపు అన్ని దినపత్రికలు,  టీవీలు రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అని రాశాయని, అందులో తమకు మద్దతు లేని పత్రికలు, టీవీలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు మాత్రం కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను ఇతర యంత్రగాన్ని వాడుకొని సభను విజయవంతం కాకుండా కుట్రలు చేయాలని చూశారని, కానీ సభకు లక్షలాది మంది చేరుకున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవర్చకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల నుండి తప్పించుకోలేదని, ఆ పార్టీ వైఫల్యాలను గ్రామాల్లో ఎక్కడికక్కడ ప్రజల పక్షాన నిలబడి బీఆర్ఎస్ శ్రేణులు నిలదీస్తాయని వేముల అన్నారు.