- మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తీసుకువచ్చే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర కల్పించడంతో పాటు వారు తీసుకువచ్చిన సరుకులకు రక్షణ కల్పించడం మార్కెట్ కమిటీ బాధ్యత అని మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో కొందరి ప్రోద్బలంతో శనివారం జరిగిన ఘటన దురద`ష్టకరమని అన్నారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల మార్కెట్ కమిటీలో జరిగిన పొరపాట్లకు భవిష్యత్తులో తావు ఇవ్వకుండా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. హమాలీలు, దడువాయిలు, చాటా, ముల్లె కార్మకుల మనోభావాలు దెబ్బతినడం వల్లనే సెక్యూరిటీ ఆఫీసర్ పై దాడికి కారణమైందన్నారు. ఈ ఘటనలో రక్షణ కోసం వచ్చిన పోలీసుల కారు అద్దాలు పగిలిన విషయంలో పోలీసు శాఖ వారే చట్టరీత్యాచర్యలు తీసుకుంటారన్నారు. ఇకముందు మార్కెట్ కమిటీలో జరిగే ప్రతి పనికి పర్యవేక్షణతో పాటు బాధ్యత వహిస్తామని, అవసరమైతే న్యాయపరమైన చర్యలకు కూడా వెనుకాడేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఎఐటియూసి జిల్లా కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ మార్కెట్ కమిటీలో కార్మికులు దశాబ్ధాలుగా పని చేస్తున్నారని కానీ కొందరు వారిపై పనిగట్టుకుని చెడు ప్రచారం చేశారన్నారు. యూనియన్లు ఎప్పుడు కూడా దొంగతనాలను ప్రోత్సహించవని గుర్తు చేశారు. ఇటీవల మార్కెట్ కమిటీలో జరిగిన కొన్ని ఘటనలకు బాధ్యులైన వారిని మార్కెట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. అయితే వారు కార్మికులను రెచ్చగొట్టి శనివారం మార్కెట్ కమిటీలో క్రయవిక్రయాలు జరుగకుండా చేసి అలజడి రేపాలని ప్రయత్నించారని అన్నారు. ఈ విషయంలో దడువాయి, ముల్లె, చాటా, హమాలీ కార్మికులు ఘటనపై చర్చించేందుకు శనివారం సమావేశం కాగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చెలరేగిందన్నారు. ఈ విషయంలో కార్మికులందరూ తమకు జీవనోపాధి కారణమైన మార్కెట్ కు చెడ్డపేరు రావడం ఇష్టం లేదని ఈ విషయంలోనే అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జె.మల్లేష్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
