. . . ఘనంగా భీంగల్ కోర్టు ప్రారంభం
. . . ఆర్మూర్ లో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు హామి
. . . గ్రామీణ ప్రాంతాలలో న్యాయసేవల కోసమే మా తపన
. . . శ్రీ నరసింహుడి సన్నీధిలో న్యాయసేవలు
. . . తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ,జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
చిరకాల స్వప్నం చిగురించిన వేళ. ముగ్గురు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యామూర్తులు జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీ నారాయణ, గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చంధర్ తో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, భీంగల్ ప్రాంత ప్రజలు కొలువు తీరిన శుభవేళ. 26, జులై 2026 శ్రీపరాభవ నామ సంవత్సరం శుక్లపక్షం ద్వాదశి న భీంగల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కమ్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కొలువు తీరిన శుభవేళ. భీంగల్ శ్రీనరసింహ స్వామి ఆశీస్సులతో జ్యోతి ప్రజ్వలన చేసుకుని ప్రారంబించుకుని మరో చరిత్రకు శ్రీకారం చుట్టుకున్న సందర్భం.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి ది మెండోరా స్వగ్రామం కావడంతో ఆయన దండిగా సహాయ సహకారాలు అందించడం, మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ ది స్వయాన భీంగల్ గ్రామం కావడం కలిసి రావడంతో భీంగల్ కోర్టు ఏర్పాటు కు పెద్దగా కష్ట పడవలసిన అవసరం ఏర్పడలేదు. వారి సంపూర్ణ సంపూర్ణ మద్దతు,పరిపాలన పరమైన రాతపోతలకు విరామం లేకుండా భీంగల్ కోర్టు ఏర్పాటుకు జిల్లా జడ్జి భారత లక్ష్మీ చేతుల మీదుగా గత సంవత్సర కాలంగా జరిగి పోయాయి. ఇంతకాలానికి కోర్టును ప్రారంభించుకోవడమే ఒక మైలురాయి. ఇక వెళదామా అతిథులు అంతరంగంలో నుండి వెలువడిన మాటల మూటలలోకి…!

నిజామాబాద్ జిల్లా పోర్ట్ పోలియో జడ్జి కమ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తంగిరాల మాధవి దేవి మాట్లాడుతూ న్యాయసేవలు సామాన్యుడి చెంతకు చేరాలానే దృఢసంకల్పంతో భీంగల్ లో కోర్టు ఏర్పాటుకు గట్టి ప్రయాత్నాలే జరిగాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని మారుమూల ప్రజలకు న్యాయం త్వరితిగతిన అందించాలానే సంకల్పం ముందు అడ్డంకులు ఏమి ఎదురు కాలేదని అన్నారు. న్యాయ ఫలాల కోసం ఎదురు చూస్తామని పేర్కొన్నారు. ఆర్మూర్ కోర్టు సముదాయంలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని ఆమె హామీనిచ్చారు. భీమ్ గల్ కోర్టు భీముడంతటి బలాన్ని సంతరించుకోవాలని ఆమె ఆకాక్షించారు. చట్ట వ్యతిరేక చర్యలను, ఘటనలు చట్టం సమ్మతించదని అందరు చట్ట ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. భీంగల్ మండల న్యాయసేవ కమిటితో కూడా ఉచిత న్యాయసేవలు ప్రతి గడపకు అందించాలనే లక్ష్యం ఇమిడి ఉన్నదని ఆమె తెలిపారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కోర్టుల ఏర్పాటు అత్యవసరం అని హైకోర్టు భావించినందునే భీంగల్ లో కోర్టు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.భీంగల్ న్యాయ పరిధిలోని మెండోరా గ్రామ వాసిగా ఇక్కడి పరిస్థితులు తెలిసిన వాడిగా కోర్టు ఏర్పాటుకు తనవంతు ఉడత భక్తిగా తోడ్పాటును అందించానని అన్నారు.చట్టపరమైన న్యాయసేవలు ప్రతి గ్రామీణుడి గడపలోకి చేరువ కావాలనే తాపత్రయం న్యాయవ్యవస్థలోని న్యాయమూర్థులలో నిక్షిప్తం అయి ఉన్నదని దానిని సద్వినియోగం చేసుకోవాలని జస్టిస్ అలిశెట్టి అన్నారు.భీంగల్ వాస్తవ్యూడిగా ప్రజల అకాంక్ష మేరకే భీంగల్ లో కోర్టు ఏర్పాటుకు తనవంతు సహకారం అందించానని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ తమ ప్రసంగంలో తెలిపారు.ప్రస్తుతం మహిళ సమాఖ్య భవనంలో ఏర్పాటు చేసిన కోర్టుకు సొంత భవనం నిర్మించి తీర్చిదిడ్డడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. తన సొంత గ్రామంలో కోర్టును ప్రారంభించుకోవడంలో ఉన్న సంతోషం మరేమి ఉంటుందని జస్టిస్ గాడి ప్రవీణ్ పేర్కొన్నారు. భీంగల్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు కార్యాచరణ మొదలు పెడుతానని అన్నారు.భీంగల్ లో శ్రీనృసింహుడు సజహసిద్ధంగా కొలువు తీరినట్టు స్వామీ వారి ఆశీస్సులతో కోర్టు కొలువు తీరిందని ఆలయ కోనేరులో స్నానం ఆచరించి పాపాల మలినాలను వదిలించుకున్నట్లు కోర్టు అనే పవిత్ర స్థలంలో నేరమయ విషసంస్కృతిని దూరం చేసుకోవడానికి కక్షిదారులు ప్రయత్నాలు చేయాలని కోరారు. భీంగల్ కోర్టు ఏర్పాటు అనుకున్నట్టు అయిందని న్యాయార్థులు అనుకున్నవి అన్ని జరగాలని జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఆశించారు.

నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ ప్రసంగిస్తూ భీంగల్ కోర్టు ఏర్పాటుతో న్యాయసేవల విస్తరణకు మరోమెట్టుగా అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షల మేరకే కోర్టుల ఏర్పాటు అనేది జరుగుతుందని తెలిపారు. భీంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం సాకారం కావడం న్యాయ చరిత్రలో మరో అధ్యాయనానికి మూలమలుపు కానుందని అన్నారు.ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చందర్ హైకోర్టు న్యాయమూర్థులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో అదనపు జిల్లాజడ్జిదారావత్ దుర్గా ప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి పాముజుల శ్రీనివాస్ రావు,ఆర్మూర్ బార్ అసోసియేషన్ బార్ ప్రధాన కార్యదర్శి పొడేటి శంకర్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు, ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి,ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి న్యాయవాదులు లోక భూపతి రెడ్డి, ఎమ్ కె నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
