Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 4:54 pm Posted by : ramakrishna

జైల్ భరోను విజయవంతం చేయాలి

 

. . . యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షుడు ఏ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచాలని, వీజీఎస్ చట్టాన్ని రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా విత్తన చట్టం, విద్యుత్ (సవరణ) చట్టాలను రద్దు చేసి, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కూలీ సంఘాలు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చాయని తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని తమ ఐక్యతను చాటాలని, తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే. దేవగంగు, జిల్లా కార్యదర్శి పీ. స్వర్ణ, జిల్లా నాయకులు శివరాజమ్మ, జ్యోతి, రాజ్యలక్ష్మి, సందీప, సరిత, చంద్రకళ, మంజులతో పాటు వివిధ మండలాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు.