నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పెరిగిన కరువుభత్యాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. శనివారం నగరంలోని కోటగల్లిలోని శ్రామిక భవన్ లో తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరికి కరువు భత్యం 55 పాయింట్లు పెరిగిందని, పాయింటుకు పది పైసలు చొప్పున రూ.5.50 పైసలు చొప్పున ప్రతి 1,000 బీడీలకు అదనంగా కూలి చెల్లించాలన్నారు. అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులకు 165 రూపాయలు పెరిగిందని, అదేవిధంగా బీడీ ప్యాకర్లకు రోజుకు రూ.5.50 పైసలు చొప్పున వివిధ నమూనా గలిగినటువంటి బీడీ ప్యాకింగ్ కు లక్షకు ఎంత అనేటటువంటిది నిర్ణయించబడుతుందన్నారు. ఈ పెరిగినటువంటి కరువు భత్యం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ కరువు భత్యం పెరుగుదల వల్ల రాష్ట్రంలో గల 7 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కనుక బీడీ లు చుట్టే కార్మికులు, నెలసరి వేతనాల ఉద్యోగులు, బీడీ ప్యాకింగ్ కార్మికులందరూ ఐక్యంగా, సంఘటితంగా యజమాన్యాలతో పోరాడి అమలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. వెంకన్న, రాష్ట్ర కోశాధికారి డి.రాజేశ్వర్, జిల్లా నాయకులు పి.సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.