Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:22 pm Posted by : ramakrishna

హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. ఇందూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇంచార్జి రాంనాథ్ సమక్షంలో నిర్వహించిన సమావేశంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమ నిర్వహణపై సోమవారం విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ, ప్రతి బీజేపీ కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థులకు జాతీయ జెండాలను పంపిణీ చేసి వారిలో దేశభక్తి స్ఫూర్తిని పెంచాలని కోరారు. అలాగే తిరంగా ర్యాలీలు, బైక్ ర్యాలీలు, యువతతో అవగాహన కార్యక్రమాలు, జాతీయ గీతాలాపనలు, దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించి, భారత త్రివర్ణ పతాక గౌరవాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దేశ సమైక్యత, జాతీయ ఐక్యతకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త తన పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను చైతన్యపరచాలని, యువతలో దేశభక్తిని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకార్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, మోర్చా అధ్యక్షులు ఓం సింగ్, వంశీ గౌడ్, వనిత, తిరుపతి రెడ్డి, కార్పొరేటర్లు శశాంక్, శ్రవణ్, యాదల నరేష్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, జస్పాల్ సింగ్, గిరిబాబు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.