. . . ఇంటి ముందర పని చేసుకుంటున్న మహిళపై దాడి చేసిన కోతి
. . . భయంతో వణికిపోతున్న మండల ప్రజలు
నసురుల్లాబాద్, బతుకమ్మ :
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకు ముదురుతోంది. మండల కేంద్రంలో వందల సంఖ్యలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, విద్యుత్ తీగలు, వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఆహారం కోసం ఇళ్లలోకి దూరి సరుకులు ధ్వంసం చేస్తున్నాయి. పాఠశాలకు వెళ్లే పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికే భయపడుతున్నారు. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ప్రజలపై దాడులకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ మహిళపై కోతి దాడి చేసి కరిచిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ఓ కాలనీలో ఇంటి ముందర పనులు చేసుకుంటున్న మహిళపై ఆకస్మికంగా దూసుకొచ్చిన కోతి ఆమె కాలు భాగాన్ని కరిచింది.

గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల ప్రకారం గత కొన్ని నెలలుగా కోతుల దాడులు పెరిగినట్లు తెలుస్తోంది. చిన్నారులపై దాడులకు యత్నించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కోతులను సురక్షిత అటవీ ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అడవుల తగ్గుదల, ఆహారం కొరత కారణంగా కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నప్పటికీ, ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు అవసరమని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి నసురుల్లాబాద్ ప్రజలకు భయముక్త వాతావరణం కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.