- అశ్వవాహనం పై అయ్యవారిని, పల్లకిలో అమ్మవారిని ఎదురేదురుగా ఎదురుకోలు
- బుకా, గులాలు చల్లుకుంటూ అర్చకుల దంపతుల నృత్యాలు
- గోవింద నామ స్మరణతో మారుమ్రోగిన సీతానగర పురావీధులు
- నేడే శ్రీలక్ష్మీనృసింహుల కల్యాణ మహోత్సవం
భీమ్ గల్, బతుకమ్మ : లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన గురువారం కల్యాణ మహోత్సవంలో గట్టంలో భాగమైన వధు వరుల ఎదురుకోలు కార్యక్రమాన్ని అర్చకులు భక్తిప్రపత్తులతో,వైభవంగా నిర్వహించారు.ఇందులో భాగంగా గర్బాలయం నుండి వధువరులైన స్వర్ణలంకరుతులైన శ్రీలక్ష్మినరసింహుల ఉత్సవమూర్తులను అర్చకులు పుష్పలంకారణ చేసిన పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాల సవ్వడి తో కల్యాణ మంటపానికి తీసుకువచ్చారు. పిదప వరుడు శ్రీ నృసింహుని ఉత్సవ మూర్తిని అశ్వవాహనం పై ఉంచి, దివ్యంగా అలంకరించి కల్యాణమండపం మొదలు కొని పుష్కరిణి పుర వీధులలో ప్రదక్షిణ చేయుచు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామి వారిని ఉంచారు. అనంతరం వధువు శ్రీ లక్మీ అమ్మవారిని పల్లకిలో స్వామి

చెంతకు ఎదురుగా తీసుకొని వచ్చి ముందుగా స్వామివారికి కి ప్రదక్షిణ చేయించారు. ఎదురేదురుగా ఉన్న వధువరులైన అయ్య, అమ్మవారల తరపు అర్చకులు బుక, గులాలు చల్లి అశ్వవాహనం పై ఉన్న శ్రీ నృసింహునికి సరి సమానంగా పల్లకిలో ఉన్న అమ్మవారిని ఊరేగింపుగా కల్యాణ మండపం ద్వారం వరకు ఎదుర్కొన్నారు. ఎదుర్కోలు సందర్బంగా అర్చకులు, వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధమైన బుక, గులాలు చల్లుకుంటూ స్వామి పల్లకి ముందు నృత్యాలు చేశారు. హరి సుందరినంద ముఖుందా హరి నారాయణ హరి ఓం, గోవింద నీ నామ మెంతో రుచిరా అంటూ భక్తి పారవశ్యంలో మునిగి జగన్నాయకుడు, జగన్నాయకిల ఎదుర్కోలు కార్యక్రమం లో నృత్యం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమానికి పట్టణం తో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామి ధ్యానం లో మునిగారు.

- నేడే లింబాద్రి లక్ష్మినరసింహుల కళ్యాణం..
ప్రతియేట నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన కార్తీక శుద్ధ నవమి రోజున లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీనృసింహుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్వామి వారి కళ్యాణనికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ధర్మకర్త అన్ని ఏర్పాటు చేశారు. కొండ పైన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
