- ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.రమేష్
సిరికొండ, బతుకమ్మ : ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ కార్మికుల పట్ల ప్రభుత్వ సవతితల్లి ప్రేమ చూపిస్తోందని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ. రమేష్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తధనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలో భాగంగా భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, మాట నిలబెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తాం అని వారు హెచ్చరించారు. వ్యవసాయ కూలీలు వ్యసరంగంలో యాంత్రికరణ, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి వలస కూలీల వల్ల ఉపాధి కోల్పోయి పొట్ట గడవని స్థితికి చేరుకున్నారన్నారు. చేతిలో పని లేక అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. తమ హామీని తామే నిలబెట్టుకోకుంటే ఎలా అని వారు ప్రభుత్వన్ని ప్రశ్నినిస్తూ, వ్యవసాయ కార్మికులు ఉపాధి కరువై అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. వ్యవసాయ కూలీల కొంతమందికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని అలా చేస్తే టిఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పడుతుందన్నారు. ఇప్పటికైనా తాత్సారం చేయకుండా వెంటనే అమలుకు పూనుకోవాలన్నారు. కాలయాపన చేయకుండా ప్రతి వ్యవసాయ కూలికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ. 12 వేలు అమలుచేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఈజీఎస్ కింద 20 రోజులు పని చేసిన వారికే ఇస్తామనడం సబబు కాదన్నారు. నిబంధనలు షరతులు లేకుండా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి బి. బాబన్న, కార్యదర్శి ఆర్. దామోదర్, మండల అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం(ఏఐపీకేఎంఎస్) మండల సహాయ కార్యదర్శి బి. రాజేందర్, నాయుడి చిన్నరాజన్న, బి. మోతిలాల్, బి. నవీన్, ఎం. దాస్, ఇ రాజేశ్వర్, కుమ్మరి. గంగు, ఇ. జమున, ఇ స్వరూప, కుమ్మరి అనంత, సీతాప్. ఇందిరా, తదితరులు పాల్గొన్నారు.