Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:25 pm Posted by : ramakrishna

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం

 

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

 

జుక్కల్, బతుకమ్మ :

 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతల సహకారం, ఐకేఎఫ్ నిధుల ద్వారా ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చి, ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న సమస్యలైన కాంపౌండ్ వాల్ నిర్మాణం, మంచాల కొరత, స్ట్రెచర్లు, బాత్రూమ్ సౌకర్యాల మెరుగుదల, తాగునీటి సదుపాయం, నర్సింగ్ స్టాఫ్ కొరత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు పొందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సమయపాలన, అత్యవసర సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ని వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసిహెచ్ఎస్, ఆసుపత్రి వైద్యులు, హెచ్ డిఎస్ కమిటీ సభ్యులు, సర్పంచ్‌ లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 

The government's goal is to provide better medical services.