Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 5:54 pm Posted by : ramakrishna

తడిసిన వడ్లను వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి

  • ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య

 

మోపాల్, బతుకమ్మ : అకాల వర్షాలతో తడిసి ముద్దయిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోపాల్ మండల కేంద్రంలో తడిసిన వరధాన్యాన్ని ఏఐకేఎంఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఎండనక వాననక, చలినీ లెక్కచేయకుండా రైతన్నలు కష్టపడి పంటలు  పండిస్తున్నారని, అకాల వర్షాల వల్ల చేతికోచ్చిన పంట చేజారి పోతుందని, రైతుల గుండె దుఃఖముతో కదులుతుందని ఆయన తెలిపారు. అన్నదాత రైతంటూ, రైతు లేనిదే రాజ్యం లేదంటూ మాటలు చెబితే రైతులకు బాధలు తీరవని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ఆయన అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచుతామని ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా రోడ్లమీద వడ్లు వారబోసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించవలసిన బాధ్యత పాలకులదే అని ఆయన అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు దళారులకు అమ్మడం వల్ల అనేక మోసాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతోపాటు, వరి ధాన్యాన్ని ఐకెపి ,సహకార సంస్థలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకెపి , సహకార సంఘం వాళ్లు వరి ధాన్యాన్ని కంటి రెప్పలా  కాపాడేటట్లు కృషి చేయాలని ఆయన కోరారు.రైతులకు సరిపడా ట్పాలిన్లు అందజేయాలని అన్నారు.  రైతులను అవస్థలకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన సూచించారు.80%సబ్సిడీతో డ్రాయ్యారు మిషన్ లను రైతులకు అందజేయాలన్నారు. నేలా తల్లిని నమ్మి వ్యవసాయం చేస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు బాధపడుతున్నారని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంపై అనేక పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయని, రైతాంగానికి వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు తొందరగా అందేటట్లు తగు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆయన కోరారు.రైతులు మోసపోకుండా ప్రభుత్వ నేరుగా కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు కలిపి డబ్బులు జమ చేయాలని అన్నారు. అన్నదాత రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యత విడనాడి యుద్ధ ప్రాతిపదికన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేనిచో రైతుల కన్నీటి దారుల్లో ప్రభుత్వం కొట్టుకపోతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సహాయ కార్యదర్శి ఏ చిన్నయ్య, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బి.నరసయ్య, రైతులు మంగల్పాడ్ మల్లేష్, ర్యాప చిన్నయ్య, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.