. . . నియోజకవర్గాల్లో ప్రతి నెలా కార్యక్రమాలు చేపట్టండి
. . . జిల్లా కోర్ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్
నిజామాబాద్, బతుకమ్మ :
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యన్ని ఎండగట్టాలని, ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా స్థానిక నాయకులు కార్యక్రమాలు నిర్వహించాలని, ఫలానా వాళ్లే కార్యక్రమాలు చేయాలనే నియమమేదీ లేదని, ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ప్రజల కోసం ఉద్యమాలు జరుగుతాయో అక్కడి నాయకులకు ప్రజల్లో ఆదరణ పెరిగి, వారే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎదిగే అవకాశం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి సూచించారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఇతర కోర్ కమిటీ సభ్యులతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలు ఆశించినంత జరగడంలేదని ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జగిత్యాల్ కేంద్రీయ విద్యాలయ స్థల విషయంలో అక్కడి నాయకులు బాగా పోరాటం చేశారని, అదే విధంగా కోరుట్ల నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు జరిగాయని, స్థానిక సమస్యలపై అక్కడి నాయకులు గట్టిగా పోరాడుతున్నారని అన్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల కారణంగా నిజామాబాద్ అర్బన్ లో కొంతవరకు రూరల్ నియోజకవర్గాల్లో కూడా కొన్ని కార్యక్రమాలు జరిగాయని, కానీ మిగతా నియోజకవర్గాల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదని అభిప్రాయపడ్డరు. ప్రజల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం పోరాడాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
