Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 December 2025, 6:33 pm Posted by : ramakrishna

పెన్షనర్లను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది

 

. . . విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ  :

రాష్ట్ర అభివృద్ధికి జీవితకాలం సేవలందించిన పెన్షనర్లను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిజామాబాద్ జిల్లా శాఖ ఆహ్వానం మేరకు అఖిల భారత పెన్షనర్స్ డే సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల క్రీడా పోటీల 2025 ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ  శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండగా, వాటి పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. పెన్షన్ల బకాయిలు, వైద్య సౌకర్యాలు, ఆరోగ్య బీమా, డి.ఏ. బకాయిలు వంటి మౌలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులు భిక్ష అడిగే స్థితికి కాకుండా, గౌరవప్రదమైన జీవితం గడపాల్సిన హక్కు ఉందని, ఆ హక్కుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీలోనూ, ప్రజల మధ్య ఉండి నిరంతరం పోరాడుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజా కార్యక్రమాలకు పరిమితమై, పెన్షనర్ల వాస్తవ సమస్యలను పక్కన పెట్టడం దురదృష్టకరమని విమర్శించారు. ఆరోగ్యం, ఐక్యత, సామాజిక స్పూర్తిని పెంపొందించే ఇలాంటి క్రీడా కార్యక్రమాలు ప్రశంసనీయం అయినప్పటికీ, వాటితో పాటు పెన్షనర్ల జీవన భద్రతకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు, వివిధ శాఖల ప్రతినిధులు, క్రీడల్లో పాల్గొన్న పెన్షనర్స్  బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

The government is completely neglecting pensioners