. . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
సదాశివ నగర్, బతుకమ్మ:
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన హెల్త్ సబ్ సెంటర్ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సమీపంలోనే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, పిల్లలకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుందని, ఇప్పటివరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండగా, ఇప్పుడు అదే సేవలు గ్రామంలోనే పొందే అవకాశం కలిగిందన్నారు. హెల్త్ సెంటర్ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని బీసీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం రెండు బోర్వెల్లు తవ్వించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న పాత ఐరన్ విద్యుత్ స్థంభాల స్థానంలో సిమెంట్ స్థంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా, ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఈ అభివృద్ధి కార్యక్రమాలపై సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, యువ నాయకులు పాల్గొన్నారు.