. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
లింగంపేట్, బతుకమ్మ
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు భరోసా కల్పించడమే పోలీసుల లక్ష్యం అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం లింగంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ లో నమోదు అయిన కేసుల వివరాలు, పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు, స్థానిక పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని అన్నారు. బక్రీద్ పండగ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలవకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాల నివారణ కోసం రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచాలని, విధి నిర్వహణ పట్ల అంకిత భావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు లక్ష్మణ్ ను ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డు అందజేశారు. ఈ తనిఖీలలో ఎల్లారెడ్డి డీఎస్పి శ్రీనివాసరావు, సిఐ రాజారెడ్డి, స్థానిక ఎస్సై దీపక్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
