. . . బీసీ గురుకులాల ద్వారా ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీ లకు ఎంపికైన విద్యార్థులకు ల్యాప్టాప్లు
హైదరాబాద్, బతుకమ్మ :
బీసీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ (ఎంజెపిటిబిసిడబ్ల్యూఆర్ఈఐఎస్) 6వ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా బలోపేతానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంజేపీ బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు మరణించిన సందర్భాల్లో వారి తల్లిదండ్రులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు. ఐఐటీలు, ఐఐఐటీలు, ఎన్ఐటీలు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించాలని నిర్ణయించారు. అలాగే పాఠశాలల్లో డెస్క్ టాప్ కంప్యూటర్ల కొనుగోలు, జూనియర్ కళాశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు, విద్యా పర్యవేక్షణ బలోపేతం వంటి అంశాలకు ఆమోదం తెలిపారు. అలాగే మహాత్మా జ్యోతిరావు గురుకుల పాఠశాలలు ఇక నుండి తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా సంస్థల సొసైటీ గా మార్పు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయాలు ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసి, విద్యార్థులను జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చితిద్దుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
