Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 6:10 pm Posted by : ramakrishna

ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం

 

. . . రూ.4 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం

 

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ప్రజలకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, పనులను వేగవంతంగా పూర్తి చేసి బ్రిడ్జిని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం, లింగంపల్లి ఖుర్ద్ హై లెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. గత ఏడాది వరదల కారణంగా బ్రిడ్జి దెబ్బతినడంతో లింగంపల్లి ఖుర్ద్‌ తో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు నిత్య రాకపోకల్లో అవస్థలు పడ్డారు. సమస్యను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే మదన్ మోహన్, బ్రిడ్జి పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోసం నిరంతరం కృషి చేశారు. ఆయన ప్రయత్నాల ఫలితంగా ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులను విడుదల చేసింది. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత లింగంపల్లి ఖుర్ద్‌ తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థుల ప్రయాణం, అత్యవసర సేవల రాకపోకలకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధికార ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.