Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 3:04 pm Posted by : ramakrishna

20న సార్వత్రిక సమ్మెను సక్సెస్ చేయాలి

భీమ్ గల్, బతుకమ్మ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేశ్ పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను మండలంలోని బాబాపూర్ చార్ భాయ్ బీడీ కంపెనీలో శనివారం కార్మికులతో కలిసి రమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గత పదకొండేళ్ల బీజేపీ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినప్పటికీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందని, మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణని విమర్శించారు.

మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతేక నినాదాలను నిరసిస్తూ, కనీస వేతనాల అమలు, రూ.9వేల పెన్షన్, నాలుగు లేబర్ కోడ్ లు, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకుడు కే రాజేశ్వర్, చార్ భాయ్ బీడీ ప్యాకర్లు సత్యం, అమీర్, బాబా, లింగం తదితరు లు పాల్గొన్నారు.