- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఆర్మూర్, బతుకమ్మ : యువత సన్మార్గంలో నడిచినప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం లో భాగంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ మైదానంలో యువతకు కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువకులకు కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ లో యువత ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్పూర్తిని చూపించారని తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు , మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి సాధనంగా కూడా భావించాలని తెలిపారు. సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోందని, ఇది ఒక ప్రమాదకరమైన మార్గం అన్నారు. ఒక్కసారైనా ఆ వ్యసనాల్లోకి అడుగుపెడితే , జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు.

యువత దేశ భవిష్యత్తు, మీరు ఆరోగ్యంగా ఉంటూ, మంచి ఆశయాలతో, పట్టుదలతో ముందుకు సాగాలని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మీకు సానుకూలమైన దారిలో దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. మిమ్మల్ని వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, సహజీవనాన్ని, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయన్నారు. మన బాధ్యతలు మనమే గుర్తించాలని, మంచి స్నేహితులను, మంచి అలవాట్లను ఎంచుకోవాలని, మీరు చేసిన ప్రతి మంచి పని, మీ కుటుంబాన్ని , సమాజాన్ని గర్వపడేలా చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం క్రీడాకారులకు బహుమతుల పోలీస్ కమిషనర్ చేతులమీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్హెచ్ఓ పి. సత్యనారాయణ గౌడ్, హెడ్ మాస్టర్ కన్వీనర్ లక్ష్మీనరసయ్య, మండలాధికారి రాజ గంగారం, 28 జట్ల యువత, ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
