Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 10:53 pm Posted by : ramakrishna

అన్యాక్రాంతమౌతున్న అడవి

  • సహకరిస్తున్న అటవీ శాఖ
  • పోడు పేరిట అడవుల నరికివేత
  • మొరం కోసం కరిగిపోతున్న గుట్టలు
  • పీసీసీఎఫ్ చర్యలతోనే అధికారుల అక్రమాలు వెలుగులోకి
  • ఎల్లారెడ్డి ఎఫ్ఆర్ వో సస్పెన్షన్ తో కలకలం

 

నిజామాబాద్, బతుకమ్మ : 9685నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అటవి సంపద కనుమరుగు వెనుక అటవీ శాఖాధికారుల హస్తాలు బయటపడుతున్నాయి. అటవీ అధికారుల నిర్లక్ష్యం, అవినీతితో కలప అక్రమ రవాణాతో పాటు యథేచ్చగా అటవీ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. తాజాగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలో 2 ఎకరాల అటవీ స్థలంలో జరుగుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవడంలో ఎఫ్ఆర్ వో విఫలం కావడంతో సస్పెండ్ చేస్తూ ఈ నెల 20న పీసీసీఎఫ్ సి.సువర్ణ ఉత్తర్వులు జారీ చేయడంతో అటవీ శాఖలో కలకలం రేపింది. రేంజ్ అధికారిపై వేటు పడడంతో అటవీ శాఖాధికారులు ఉలిక్కిపడ్డారు. 2024లో సిరికొండ ఫారెస్టు రేంజర్ వినయ్ తో పాటు సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లను తూంపల్లి సెక్షన్ లోని జంగిలోడి తాండలో జరిగిన అటవీ భూముల ఆక్రమణలో హస్తం ఉందని అటవీ అధికారులు వేటు వేశారు. సరిగ్గా ఏడాది తర్వాత ఎఫ్ఆర్వో స్థాయి అధికారి సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా చిట్టడవులకు ప్రసిద్ది చెందింది. ఉమ్మడి జిల్లాలో 14 అటవీ రేంజ్ కార్యాలయాల పరిధిలో లక్షా హెక్టార్ల అటవీ భూమి ఉంది.  దాదాపు 2 లక్షల ఎకరాలలో విస్తరించిన అడవి నానాటికి కుచించుకపోతుంది. ఒకవైపు పోడు పేరిట చెట్ల నరికివేత నిరంతరాయంగా సాగుతుంది. చిరుతలు, ఎలుగుబంట్లు, ఏదులు, జింకలు, అడవి పందులు, కుందేళ్ళకు ఆలవాలమైన అడవిలో వేట నిరంతరాయంగా సాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా శ్రీరాంసాగర్ పరివాహక ప్రాంతంలో గోదావరి, మంజిరా నదుల వరకు క్రిష్ణజింకలు(బ్లాక్ బక్స్) లు ఉండగా వాటికి కూడా ముప్పు ఏర్పడింది. వన్యప్రాణుల వేట సాగుతుండగా అభివ`ద్ది పనుల కోసమని గుట్టలను మొరం కోసం కరిగించేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు అనుమతులు తీసుకుని అటవి భూముల్లో యథేచ్చగా తవ్వకాలు జరుగుతుండగా అటవీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, గాంధారి మండలాల్లో అటవీ భూముల ఆక్రమణపై కేసులు నమోదు అయ్యాయి. అయితే అక్కడ ప్రతి యేటా అటవీ సంపద కరిగిపోతున్న పోడు పేరిట చెట్ల నరికివేత జరుగుతుండగా భూముల ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు రేంజ్ కార్యాలయాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా అటవీ భూముల ఆక్రమణలు జరుగలేదు. వన్యప్రాణుల వేట అంతగా జరుగలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రెండు జిల్లాలుగా విడిపోయిన విషయం తెల్సిందే. నిర్మల్ జోన్ లో కలిపిన అధికారులు కొత్తగా రేంజ్ ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు డీఎఫ్ వోల పర్యవేక్షణలో నలుగురు ఎఫ్ డీవోలు , 14 మంది ఎఫ్ఆర్ వోలు ఉన్నప్పటికీ అటవీ సంపద మాత్రం అన్యక్రాంతం అవుతునే ఉంది. ఫ్లయింగ్ స్క్వాడ్ ను బాసరకు తరలించిన అధికారులు ఇక్కడ మాత్రం స్థానికంగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. నైజం కాలం నాటి అటవీ చట్టాలను కొనసాగిస్తూ పోడు భూముల వ్యవహరంలో వాటిని అమలు చేస్తుండడంతో భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట పడడం లేదు. దానికి తోడు అటవీ శాఖలో అధికారుల అవినీతితో వన సంపద కరిగిపోతుంది. భూములలో మొరం తవ్వకాలతో ఏర్పడిన ఖాళీ స్థలాలను కూడా కబ్జా చేస్తున్నారు. వన్యప్రాణి వేట మాత్రం సాగుతునే ఉంది. అటవీ శాఖలో అధికారులపై వేటు వేసినప్పుడు మాత్రమే వెనక్కి తగ్గుతున్న అధికారులు షరా మామూలుగానే పట్టించుకోవడం లేదనే వాదనలున్నాయి.

The forest is becoming alienated.