. . . బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పేపర్ లీక్ వ్యవహారాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండి స్తూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నిరసన చేపట్టిన సీజేపీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అణచివేయడం సరికాదని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆయనన్నారు. అలాగే ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపించిన ఆయన, విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తగిన సమాధానం చెబుతారని అన్నారు.