. . . బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్
కామారెడ్డి, బతుకమ్మ :
నీట్ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలు, పరిపాలనా వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని బీడీఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపాయని ఆయన పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల సందర్భంగా జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండించిన భాస్కర్, విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)ను రద్దు చేసి, పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యాసంస్థల బంద్కు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బీడీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సుదర్శన్, జిల్లా నాయకుడు గైని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.