. . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, బతుకమ్మ :
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పలు అనుమానాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె కొడంగల్ నియోజకవర్గ ఓటర్ల జాబితాపై పలు ఆరోపణలు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 22 వేల డూప్లికేట్ ఓట్లు, మరో 11 వేల కర్ణాటక రాష్ట్రంలోని సెడం నియోజకవర్గానికి చెందిన ఓటర్లు నమోదై ఉన్నట్లు తమ పరిశీలనలో గుర్తించామని కవిత తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 800 ఓట్లను మాత్రమే తొలగించడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో దాదాపు 32 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేస్తూ, డూప్లికేట్ మరియు ఇతర రాష్ట్రాలకు చెందిన ఓట్ల వల్లే ఆ విజయం సాధ్యమైందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరించిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. భోదన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 7 వేల ఓట్లు తొలగించారని, అయితే వాటి తొలగింపుకు గల కారణాలను ఈసీ వెల్లడించలేదని కవిత విమర్శించారు. ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎన్నికల సంఘం నిబంధనలను పూర్తిగా పాటించలేదనే అనుమానం ఉందన్నారు. ఇంటర్-స్టేట్ డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించే వ్యవస్థ ఎన్నికల సంఘం వద్ద ఉందా అనే విషయాన్ని స్పష్టం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు భారతదేశంలో ఓటు హక్కు ఉండకూడదని చెప్పడం సమంజసమేనని, అయితే ఒకే వ్యక్తికి రెండు లేదా మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండటం కూడా నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిజంగా ప్రయోజనకరంగా ఉండాలంటే రాష్ట్రాల మధ్య డూప్లికేట్ ఓట్లను పూర్తిగా తొలగించే శాశ్వత వ్యవస్థను అమలు చేయాలని కవిత సూచించారు. “వన్ నేషన్ – వన్ ఎలక్షన్ – వన్ ఓట్” విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆమె కోరారు. అలాగే, ఎస్ఐఆర్కు సంబంధించి ఈసీ ఈ ఏడాది జనవరి 1ను కాకుండా గత ఏడాది జనవరి 1ను రిఫరెన్స్ పాయింట్గా తీసుకోవడం వల్ల పలు నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించబడినట్లు కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపైనా ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
