Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 5:20 pm Posted by : ramakrishna

కామారెడ్డి పట్టణాభివృద్ధే మా లక్ష్యం..

 

. . . మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

గత ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణంలోని రోడ్లు, కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ వర్షాకాలంలో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కామారెడ్డి మున్సిపాలిటీ ముందస్తుగా నడుం బిగించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని 14వ వార్డులోని కాకతీయ నగర్ కాలనీ పరిధిలో గల లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీల పూడికతీత, చెత్తాచెదారం తొలగింపు పనులను శుక్రవారం జేసీబీలతో ముమ్మరంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజల భద్రత, సౌకర్యమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. వర్షపు నీరు ఎక్కడా నిలిచిపోకుండా, డ్రైనేజీలు సాఫీగా సాగేలా వివిధ వార్డు లలో ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ రాంశెట్టి హర్షిత, అంజాద్, గణేష్, రామ్మోహన్, నిట్టు గంగాధర్, మోతిలాల్, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మాంతరావు, భూపతి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

The development of Kamareddy town is our goal.