. . . కార్ల్ మార్క్స్ 143వ వర్థంతి సభలో సీపీఎం సభ్యులు బుర్రి ప్రసాద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దోపిడీ లేని సమాజ నిర్మాణం కేవలం వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యపడుతుందని కార్ల్ మార్క్స్ విశ్లేషించారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ అన్నారు. శనివారం కార్ల్ మార్క్స్ 143 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, దోపిడీ కారణాలను విశ్లేషిస్తూ దాస్ క్యాపిటల్ ను రచించి, నేటికీ ప్రపంచంలో జరుగుతున్న అనేక పరిణామాల పైన దాస్ క్యాపిటల్ ఒక మార్గదర్శకంగా ఉండేటట్లు చేసిన మహానుభావుడు కారల్ మార్క్స్ అని అన్నారు. అందుకే ఆటుపోట్లు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి అనుసరించాల్సిన పద్ధతులను తెలుసుకోవడం కొరకు దాస్ క్యాపిటల్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ కార్మిక వర్గాన్ని శ్రమ దోపిడీ చేస్తూ లాభాలను పెంచుకోవటానికి అనేక పద్ధతులను అనుసరిస్తూ అసమానతలు పెరగటానికి కారణమవుతున్నాయని, అందువల్ల ఈ ప్రపంచంలో దోపిడి, అసమానతలు, వివక్షత ఉన్నంతకాలం కమ్యూనిజం అనే సిద్ధాంతం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శివర్గ సభ్యులు నూర్జహాన్, పల్లపు వెంకటేష్, నాగన్న జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్, సుజాత, నన్నే సాబ్, నగర కమిటీ సభ్యులు అనసూయమ్మ, అనిత, అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.