- తెయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : భారతీయుల పవిత్ర గ్రంథమే భారత రాజ్యాంగం అని తెయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలో సామాజిక న్యాయం -విద్యా యువత సాధికారత అనే అంశంపై ఎస్సీ సెల్ డైరెక్టర్ డాక్టర్ వాణి నేతృత్వంలో కార్య శాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు హాజరై ప్రసంగించారు. భిన్న జాతులు, భిన్న కుల మతాల, విభిన్న సంస్కృతుల సమహారమే భారతదేశమన్నారు.

భారత రాజ్యాంగం వలన భారతీయులంద రు సమానంగా గౌరవిస్తున్నారన్నారు. అందుకే రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. మాజీ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ ఆ సమాన సమాజాన్ని సమానం చేయాలన్నదే డా. బి. అర్. అంబేద్కర్ జీవిత పోరాటం అన్నారు. భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగం అమలులోకి ముందు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారత పౌరులు ప్రాథమిక హక్కులు, విధులు,ఆదేశిక సూత్రాలు, ఎన్నికలు, రిజర్వేషన్లను అనుభవిస్తున్నారన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల పని విధానాలు ఆవిష్కరించబడి అవి భారత ప్రజలను సమున్నతులు గా మార్చినాయున్నారు. ఇది కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన అత్యుత్తమ రాజ్యాంగం ద్వారా నే సాధ్యమైందన్నారు. అందువలన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలను పూర్తిస్థాయిలో ఈ సమాజానికి అనువర్తింపజేయాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి సందేశమిస్తూ భారత రాజ్యాంగంలో రాసుకున్న సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలను ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యశాలలో యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆచార్య కనకయ్య, డాక్టర్ ఎన్ మోహన్ బాబు, డాక్టర్ టి సంపత్ తదితరులు తమ ప్రసంగాలలో అంబేద్కర్ రచనలను, పోరాటాలను గుర్తు చేసినారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ డీన్ లు ఆచార్య ఘంటా చంద్రశేఖర్, డాక్టర్ స్వప్న డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ నేత, పరిశోధక విద్యార్థులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
