Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 7:01 pm Posted by : ramakrishna

కామ్రేడ్ డీవీకే స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి

 

. . . సీపీఐ ఎంఎల్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆదర్శ కమ్యూనిస్టు, కార్మిక వర్గ పోరాట యోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ డి.వి కృష్ణ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యునిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యునిగా సుదీర్ఘకాలం పనిచేశారని, కార్మిక ఉద్యమానికి ఆలిండియా ప్రధాన కార్యదర్శిగా, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారన్నారు. 50 సం ల విప్లవ జీవితమంతా విప్లవోద్యమం నిర్మించటానికి చివరిదాకా కామ్రేడ్ డి.వి కృష్ణ కృషి చేశారన్నారు. కామ్రేడ్ డివి కృష్ణ 2022 జూన్ 26న క్యాన్సర్ వ్యాధితో మరణించారన్నారు. ఈనెల 26న 4వ వర్ధంతి సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ డివి కృష్ణ స్మారకోపన్యాసాల్ని జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నామన్నారు. ఆర్థిక సంక్షోభం – ప్రజలకు సవాళ్లు అనే అంశంపై హెచ్.సి.యు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, దేశంలో పెరుగుతున్న ఫాసిజం అంశంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, కామ్రేడ్ డీవీకే సిద్ధాంత, రాజకీయ కృషి అంశంపై పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కే.జీ రాంచందర్ లు ఉపన్యసిస్తారన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కార్మికులు ఈ స్మారకోపాన్యాసాలను జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి. గోదావరి, కే.సంధ్యారాణి, పార్టీ నగర నాయకులు లింగం, విఠల్, గంగాధర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.