Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 6:08 pm Posted by : ramakrishna

ఆసిఫ్ ను పరామర్శించిన రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ ప్రాంతంలో పాత నేరస్థుడు రియాజ్ చేతిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహమ్మద్ ఆసిఫ్ ఖాన్ ను రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసిఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీ.సీ.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన పాత నేరస్థుడు రియాజ్ ను పోలీసులు పట్టుకోవడంలో ఆసిఫ్ చూపిన తెగువ, కనబర్చిన ధైర్య సాహసం ప్రశంసనీయమని చైర్మన్ తారిక్ అన్సారీ అభినందించారు. రియాజ్ దాక్కున్న  ప్రదేశాన్ని పోలీసులకు తెలియజేయడంతో పాటు, అతడిని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ పోలీసులకు ధైర్యంగా సహకరించారని అన్నారు. రియాజ్ కత్తితో దాడి చేయడంతో ఆసిఫ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడని గుర్తు చేశారు. యువత ఆసిఫ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, నేరాలపై పోరాటంలో భాగస్వాములు కావాలని చైర్మన్ పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి పోలీసులు, బాధ్యత గల పౌరులు కలిసి పని చేయడం అవసరమని అన్నారు. కాగా, ఆసిఫ్ ఖాన్ ను హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి  చికిత్స చేయించడంతో పాటు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసు శాఖను చైర్మన్ తారిక్ అన్సారీ అభినందించారు.