. . . కారేగాం సర్పంచ్ డా.రమావత్ లాల్ సింగ్
చందూర్, బతుకమ్మ :
దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని కారేగాం సర్పంచ్ డా. రమావత్ లాల్ సింగ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చందూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును హరించే విధంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించదగ్గ చర్య అని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై సమగ్ర, పారదర్శక విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోతరాజు శ్రీను, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉమారాణి సంజీవ్, రాంరెడ్డి, సర్పంచ్లు శ్రావణి రవి, కృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ ప్యారం అశోక్, ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచ్ దాడికి సాయిలు, మాజీ సర్పంచ్లు సత్యనారాయణ, గంగారాం, అంబర్ సింగ్, హైమద్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
