. . . ఏఐకేఎంఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఏఐకేఎంఎస్ సీనియర్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపన్న ఆరోపించారు. నగరంలోని కోటగల్లిలోని ఎన్.ఆర్. భవన్లో అగ్గు ఎర్రన్న అధ్యక్షతన మంగళవారం అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) నిజామాబాద్ డివిజన్ 5వ మహాసభ నిర్వహించారు. సంఘం సీనియర్ నాయకులు అగ్గు ఎర్రన్న ఏఐకేఎంఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆకుల పాపన్న మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేద ప్రజలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర ఉందని, నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు దేశంలోని పీడిత ప్రజలకు దిశానిర్దేశం చేసిన పోరాటాలని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నదుల ద్వారా సుమారు 2 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోందని, దీంతో 60 వేల ఎకరాలకు సాగునీరు అందక భూములు బీడుగా మారుతున్నాయని పాపన్న ఆవేదన వ్యక్తం చేశారు.

పెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రజాప్రతినిధులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీలను ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. దీనివల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ, దేశ వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలకవర్గ పార్టీలకు రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదని, దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని విమర్శించారు. జిల్లాలోని బోధన్ చక్కెర కర్మాగారాల భూముల పరిరక్షణలో ఏఐకేఎంఎస్ పోరాటం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి మాట్లాడుతూ, నగరానికి సమీపంలో ఉన్న సారంగాపూర్ ఎన్సీఎస్ఎఫ్ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభించి, బెల్లం తయారీ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల రైతులు, వ్యవసాయ కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. మహాసభలో దేవదత్ బన్సీ, జే.పీ. గంగాధర్, చిన్నయ్య, గోపాల్, బి. దేవస్వామి, ముత్యాల నారాయణ, రాపాని గంగాధర్, బి. సాయిలు, కొరటిపల్లి గంగాధర్, సుమన్, సరోజన, నరసవ్వ, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
