Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 7:12 pm Posted by : ramakrishna

కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడింది

 

. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందన్నారు. జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారిందన్నారు. ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. దీని వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.