నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర 3వ మహాసభ పోస్టర్లను టీయూసీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులందరికీ లేబర్ కార్డులు అందించాలన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను పెంచాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను రాష్ట్ర మహాసభలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. ఈనెల 25న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక సంఘం (టీయూసీఐ) రాష్ట్ర 3వ మహాసభను జయప్రదం చేయాలని జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.నరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు డి.రాజేశ్వర్, నాయకులు పి.రవి, డి.కిరణ్, సాయన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.