. . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రజల్లో ఐక్యత, సామరస్యాన్ని చాటిచెబుతుందని డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పేర్కొన్నారు. నగరంలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల కార్యక్రమాల్లో నగర డీసీసీ అధ్యక్షులు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ల ఆధ్వర్యంలో, గాండ్ల సంఘం ఆధ్వర్యంలో, బొబ్బిలి వీధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో, అలాగే పోచమ్మగుడి ఎస్సీ బస్తీ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమాల్లో రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ మన జీవన విధానానికి, భక్తి పారవశ్యానికి, ఆచార వ్యవహారాలకు నిలువెత్తు రూపం ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగని అన్నారు.

ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా బోనాల పండుగను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని రామకృష్ణ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా సంఘాల ప్రతినిధులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
