. . . పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
బాల్కొండ, బతుకమ్మ :
జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బాల్కొండ కోర్స్ డైరెక్టర్పై తక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో బాల్కొండలో నిర్వహించిన సాంఘిక శాస్త్రం శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన నోటుబుక్స్ ను ఉపాధ్యాయులకు అందజేశారని ఆయన ఆరోపించారు. విద్యా సంవత్సర ప్రారంభంలో పేద విద్యార్థులకు చేరాల్సిన విద్యా సామాగ్రిని శిక్షణ అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా శిక్షణలో నాణ్యతలేని సామాగ్రిని ఉపయోగించడమే కాకుండా, శిక్షణ కార్యక్రమాల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాల్కొండ కోర్స్ డైరెక్టర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని కృపాల్ సింగ్ సోడి ప్రభుత్వాన్ని కోరారు.