. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అంకితభావంతో సేవలందించిన ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్ఐ డి. జక్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి. సాయి బాబాను శాలువాలతో సత్కరించి వారి సేవలను ప్రశంసించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ రెహమాన్ హోటల్ నుంచి నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు బోధన్ ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఆరవ టౌన్ ఎస్సై కే.సందీప్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ డి. జక్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బి. సాయి బాబా వెంటనే స్పందించి ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో నీటి ప్రవాహం నిలిచిపోయిన విషయాన్ని గుర్తించిన పోలీసులు సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి జేసీబీల సహాయంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రైనేజీలను పూర్తిగా శుభ్రం చేయించారు. పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ రహదారులపై నిలిచిన నీరు త్వరగా తొలగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సేవలను గుర్తించిన సీపీ మాట్లాడుతూ, ప్రజాసేవే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఇదే సేవాస్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఆరవ టౌన్ ఎస్సై సందీప్ తదితరులు పాల్గొన్నారు.
