. . . ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలాంటి షరతులు లేకుండా, డిలిమిటేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నాందేవాడ ఐద్వా కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వామపక్ష మహిళా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి ఎం. సుప్రియ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి స్వరూపరాణి పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు పార్లమెంట్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినప్పటికీ, దాని అమలును డిలిమిటేషన్ ప్రక్రియతో ముడిపెట్టడం మహిళలకు తీవ్ర అన్యాయం చేయడమేనని విమర్శించారు.

స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ అమలుతో మహిళలు సమర్థవంతమైన నాయకత్వాన్ని నిరూపించుకున్నారని, అదే విధంగా పార్లమెంట్, శాసనసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వామపక్ష మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో గోదావరి, అనిత, రజియా, శ్రీదేవి, మాధవి, మాజిత, సంజన, లక్ష్మి, సురేఖ, ఫర్జానా, గీత తదితరులు పాల్గొన్నారు.
