. . . ఏబీవీపీ కార్యకర్తల ధర్నా
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ను కచ్చితంగా అమలు చేయాలని, ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్న కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో భాగంగా కొందరు కార్యకర్తలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు మరియు పోలీసు సిబ్బంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఘటన అనంతరం కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యార్థుల హక్కులను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
