Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2025, 2:29 pm Posted by : ramakrishna

తెలంగాణ వేగుచుక్క దొడ్డి కొమురయ్య

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జమీందారుల, నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బడుగు బలహీన వర్గాల జాతికి ఆనాడు దొడ్డి కొమరయ్య మరణం ఒక వేగుచుక్కగా మారి అందరిని ఏకం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు  అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విసునూరు దేశ్ముఖ్ జానకి యొక్క ఆగడాలను అడ్డుకోవడానికి అప్పటివరకు శాంతియుతంగా చేస్తున్న నిరసనలు దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ సాయిగా రైతాంగ పోరాటంగా మారి జమీందారుల నిరంకుశ పాలనకు చరమాంకం పలికిందన్నారు. ఆ రోజు దొడ్డి కొమరయ్య మరణం తోనే ప్రజల్లో ఒక ఆలోచన మొదలైందని తెలిపారు. ప్రజలందరూ ఏకతాటిపై రాగలిగారన్నారు. ప్రజలందరూ ఈ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి విజయం సాధించగలిగారని తెలిపారు. ఆయన మరణం పీడిత జనానికి ఒక దారి చూపెట్టిందని పేర్కొన్నారు. ఒక వేగుచుక్కగా మారిందన్నారు. దొడ్డి కొమరయ్య కేవలం ఒక వ్యక్తి కాదు తెలంగాణ పౌరుషానికి ప్రతీక అని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఏకం కావడానికి కారణం వారి త్యాగమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నరాల సుధాకర్, బుస ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కొయ్యాడా శంకర్, బసవసాయి, బగ్గలి అజయ్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.